సాయంత్రం సీఎం జగన్ ప్రెస్‌మీట్.. కీలక ప్రకటన చేయబోతున్నారా

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రెస్‌మీట్‌కు సిద్ధమయ్యారు. గురువారం సాయంత్రం 5 గంటలకు మీడియా ముందుకు రానున్నారు. కరోనా నివారణ, లాక్‌డౌన్, ప్రభుత్వం చేపట్టిన చర్యలపై ప్రజలనుద్దేశించి మాట్లాడనున్నారు. సీఎం జగన్ మీడియా సమావేశంలో ఏం చెప్పబోతున్నారన్నది ఆసక్తికరంగా మారింది. ఏదైనా కీలక ప్రకటన ఉంటుందనే ప్రచారం జరుగుతోంది.

ముఖ్యమంత్రి రాష్ట్రంలో తాజా పరిణామాలు, నిత్యావసర వస్తువులు, కూరగాయలు, నగదు పంపిణీ, వాలంటీర్ వ్యవస్థ పనితీరుపై మాట్లాడబోతున్నారని సమాచారం. అలాగే తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ సరిహద్దులో ఇబ్బందులపైనా సీఎం స్పందించే అవకాశం ఉంది. అలాగే హైదరాబాద్‌లో కొంతమంది ఏపీ విద్యార్థులు, ఉద్యోగులు హాస్టల్స్‌లో ఉండటంతో వారు తిరిగి సొంత ఊళ్లకు వెళ్లేందుకు ప్రయత్నించారు. గుంటూరు, కృష్ణా జిల్లాల్లో సరిహద్దుల దగ్గర వారిని పోలీసులు నిలిపివేశారు. ఈ అంశంపై ముఖ్యమంత్రి జగన్ కూడా చొరవ తీసుకున్నారు.. ఎవరికీ ఏ ఇబ్బంది రాకుండా చర్యలు తీసుకోవాలని అధికారుల్ని ఆదేశించారు. తెలంగాణలో అధికారులతో మాట్లాడాలని సూచించారు.